కోవిడ్‌తో క్షయకు అవకాశం

18 Jul, 2021 04:42 IST|Sakshi

బ్లాక్‌ ఫంగస్‌ తరహాలో ఇదొక సంక్రమణ

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ వల్ల ఒక వ్యక్తి  క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్‌ ఫంగస్‌ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్‌ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్‌ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఇటీవల కోవిడ్‌ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది.

‘కోవిడ్‌ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్‌ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని   పేర్కొంది ‘ఇది బ్లాక్‌ ఫంగస్‌ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్‌ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్‌ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్‌ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్‌ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్‌ నిర్ధారణ క్యాంపెయిన్‌ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది.

మరిన్ని వార్తలు