కేంద్రం ప్రకటన: 99 శాతం రికవరీ, 1 శాతమే డెత్‌రేట్‌

27 Apr, 2021 11:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భారత్‌ను చిగురుటాకులా వణికిస్తూ... కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ కాస్త ఊరట కలిగించేలా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో కోవిడ్‌-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపింది.  కాగా కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం దేశవ్యాప్తంగా 14.02 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3.54 లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక సోమవారం కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు.  

ఈ క్రమంలో, తాజాగా కేంద్రం ప్రకటనతో సెకండ్‌ వేవ్‌లో కరోనా తన ప్రతాపం చూపిస్తున్నా ఇప్పటి వరకూ మరణాల రేటు 1 శాతం మాత్రమే ఉందని, 99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో మరణాల రేటు 1.12 శాతం ఉంటే, 98.88 శాతం మంది కరోనా నుంచి రికవరీ అవుతున్నారని, వారిలో  ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో 37శాతం మందికి వెంటిలేషన్‌ అవసరం కాగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.  

కాగా మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో తగ్గుతున్న కేసుల కంటే నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక వైరస్‌ వ్యాప్తికి హాట్‌ స్పాట్‌ గా ఉన్న మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ లలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

చదవండి: పాజిటివ్‌ రాకున్నా, లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చాల్సిందే!

మరిన్ని వార్తలు