నెగెటివ్‌గా తేలినా మళ్లీ టెస్టు బెటర్‌: నిపుణులు

20 Apr, 2021 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఫలితం మాత్రం నెగటివ్‌ అని చూపుతోందని అంటున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. మిగతా 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరమే. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్‌ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకావం ఉంది. అది చివరకు ప్రాణాంతకంగా మారొచ్చు. కాబట్టి కరోనా లక్షణాలు కొనసాగుతుండగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులో నెగటివ్‌ వస్తే 24 గంటల తర్వాత మరోసారి అదే టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

రెండోసారి కూడా నెగటివ్‌ వస్తే సీటీ స్కాన్‌/చెస్ట్‌ ఎక్స్‌–రే తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. కరోనా సోకినప్పటికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌గా రావడానికి పలు కారణాలున్నాయి. నమూనాను(శాంపిల్‌) సక్రమంగా సేకరించకపోవడం, అందులో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉండగానే త్వరగా పరీక్ష చేయడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్‌లను కూడా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల్లో గుర్తించగలుగుతున్నామని ఐసీఎంఆర్‌ ప్రతినిధి డాక్టర్‌ సమీరన్‌ పాండా చెప్పారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో 40 శాతం ఫలితమే తెలుస్తుందని సీనియర్‌ డాక్టర్‌ ఒకరు చెప్పారు.

చదవండి: సర్జికల్‌ మాస్కుపై క్లాత్‌ మాస్కు ధరిస్తే..

మరిన్ని వార్తలు