Lockdown Update: జూలై 19 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

10 Jul, 2021 14:27 IST|Sakshi

తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

చెన్నై: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 19 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. అయితే, హోటళ్లు, టీ షాపులు, బేకరీలు, చిరు తిండ్ల షాపులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేలా సడలింపులు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే, భైతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని పునరుద్ఘాటించింది. 

అదే విధంగా.. పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు ముఖ్యంగా బస్సు సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇక, పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని స్టాలిన్‌ సర్కారు స్పష్టం చేసింది. కాగా తమిళనాడులో శుక్రవారం కొత్తగా 3039 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా, 69 మంది కోవిడ్‌ బాధితులు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల 13 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 

మరిన్ని వార్తలు