కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కు చెందిన ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్ వ్యాధుల విభాగం అధినేత డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. వైరస్ వ్యాప్తికి దారితీసే సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని సూచించారు. భారత్లో కరోనా థర్డ్ వేవ్ తథ్యమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఐఎంఏ సూచించింది. కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.