ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ధర ఇలా..

27 Feb, 2021 19:25 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును 250 రుపాయలకు అందించాలని శనివారం కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అందులో 100 రూపాయలు సర్వీస్‌ ఛార్జ్‌ కాగా 150 రుపాయలుగా టీకా ఖరీదుగా పేర్కొంది. ప్రైవేట్‌  దవాఖానల్లో  కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర రూ 250కి మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వీటిని ఆస్పత్రి వర్గాలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ఉచితంగా వాక్సినేషన్‌ పంపిణీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలకు టీకా ధరలను తెలియజేయాలని కేంద్రం పేర్కొంది. 

మరోవైపు తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ అందించిన కేంద్రం మార్చి 1 నుంచి 65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో మొత్తం 1200 కేంద్రాల్లో 60 ఏళ్ళు పై బడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. అందులో 200 కేంద్రాలు ప్రైవేట్‌కు చెందినవే ఉన్నాయి.

చదవండి: వృద్ధులకు టీకా దరఖాస్తు ప్రారంభం

మరిన్ని వార్తలు