కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌

28 Jul, 2021 17:25 IST|Sakshi

కార్మికుల కుటుంబాలకు పింఛన్‌ ఇస్తామని ప్రకటన

సాక్షి, న్యూడిల్లీ: కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్‌ను అందించేందుకు ఈఎస్‌ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2020 మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించిన ఈఎస్‌ఐసీ కోవిడ్‌-19 రిలీఫ్‌ స్కీమ్‌ రెండేళ్లపాటు అమలులో ఉంటుందని తెలిపారు.

ఈఎస్‌ఐసీ వద్ద ఇన్సూర్‌ అయిన కార్మికులపై ఆధారపడిన కుటుంబసభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం కింద మరణించిన కార్మికుడు లేదా ఉద్యోగిపై ఆధారపడిన అర్హులైన కుటుంబసభ్యులకు ఉద్యోగి పొందే వేతనంలో సగటున 90 శాతం మొత్తాన్ని పింఛన్‌ కింద చెల్లిస్తామని మంత్రి రామేశ్వర్‌ తేలి వివరించారు. ఈ పింఛన్‌ పొందడానికి రూపొందించిన అర్హతలు ఇవే.

  • కోవిడ్‌ సోకినట్లుగా గుర్తించిన రోజు నుంచి మూడు నెలల ముందు సదరు కార్మికుడు లేదా ఉద్యోగి తప్పనిసరిగా ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
  • కోవిడ్‌ బారిన పడటానికి ముందు కనీసం 70 రోజుల పాటు ఆ ఉద్యోగి తరఫున ఈఎస్‌ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి.
  • కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మహిళ ఉంటే పింఛన్‌ ప్రయోజనం భర్తకు లభిస్తుంది.
  • ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్‌ నిబంధనల ప్రకారం కార్మికుడు మరణానంతరం అతడి భార్య తిరిగి వివాహం చేసుకునే వరకు పింఛన్‌కు అర్హురాలు. అయితే ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం కింద పింఛన్‌కు అర్హురాలైన మహిళకు ఈ నిబంధన వర్తించదు.
  • ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు కూడా ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పింఛన్‌కు అర్హులైన కుటుంబసభ్యుల్లో భర్త లేదా భార్య వారి జీవితాంతం పెన్షన్‌ పొందే అవకాశం ఉంది.
  • లబ్ధిదారుడు కుమారుడైతే అతడికి 25 ఏళ్లు నిండే వరకు, కుమార్తె అయితే వారికి వివాహం జరిగే వరకూ పింఛన్‌ పొందడానికి అర్హులు.
మరిన్ని వార్తలు