కరోనా విజృంభణ.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

20 Apr, 2022 13:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు పెద్దఎత్తున కరోనా బారిన పడటం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో  కోవిడ్‌  పరిస్థితిపై చర్చించేందుకు ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీతో వైద్యారోగ్యశాఖ అధికారులు బధవారం సమావేశమయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్‌ కట్టడికి నిపుణులతో చర్చింది ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కాగా ఢిల్లీలో ప్రతిరోజూ అయిదు వందల వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 632 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉంది. అయితే కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం శుభపరిణామం. మరోవైపు దేశవ్యాప్తంగా మంగళవారం 4.21 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 
చదవండి: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. ఢిల్లీలో కలవరం

మరిన్ని వార్తలు