భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా?

29 Apr, 2021 16:51 IST|Sakshi

ముంబై: గత ఏడాది లాక్‌డౌన్ భయాలు ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయి అనుకుంటా. అందుకే, ఈ ఏడాది కూడా ఎప్పుడు లాక్‌డౌన్ విధిస్తారో అని ఇప్పుడే అందరూ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు విషయంలో పలు కీలక అంశాలను ఒక నివేదికలో ప్రస్తావించింది. నివేదిక ప్రకారం.. ప్రజలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎప్పుడు లాక్ డౌన్ విదిస్తుందో అని ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు భారీగా విత్‌డ్రా చేసుకుంటున్నారు అని ఆర్బీఐ వెల్లడించింది.

కేవలం 15 రోజుల్లోనే భారీగా డబ్బులు వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. అంతకు ముందు పదిహేను రోజుల కాలంతో పోలిస్తే ఏప్రిల్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న సొమ్ములో రూ.30,191 కోట్ల పెరుగుదల కనబరిచినట్టు పేర్కొంది. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు 27.87 లక్షల కోట్ల రూపాయలు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9 మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న నగదు గతం కంటే దాదాపు 52,928 కోట్ల రూపాయలు పెరిగాయి.

లాక్ డౌన్ విధించవచ్చనే భయమే అందుకు కారణమని భావిస్తున్నారు. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే, గత ఏడాది లాగా ఇబ్బందులు పడకుండా బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. అందువలెనే, క్యాష్ విత్‌డ్రాయెల్స్ భారీగా పెరిగాయి. 2020లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు ఎక్కువగా ఉపసంహరించుకుని, దగ్గర పెట్టుకున్నారు.

చదవండి:

సామాన్యులకు ఊరట.. జీఎస్‌టీ తొలగింపు!

మరిన్ని వార్తలు