ఫోర్త్‌ వేవ్‌ ముప్పు తప్పదంటున్న నిపుణులు..

27 Apr, 2022 08:34 IST|Sakshi

శివాజీనగర: రాష్ట్రంలో అప్పుడే కరోనా నాలుగో వేవ్‌పై వేడి చర్చ మొదలైంది. అందుకు ప్రజలను జాగృతం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలో కోవిడ్‌ నాలుగో దాడి జూన్‌ ఆఖరి నుంచి ఆరంభమయ్యే అవకాశముందని కాన్పూర్‌ ఐఐటీ నిపుణులు పరిశోధనలో పేర్కొన్నారు, కానీ ఒక నెల ముందుగానే కరోనా వేవ్‌ రావచ్చునని ఆరోగ్య మంత్రి సుధాకర్‌ తెలిపారు. మంత్రి మాటలను బట్టి మే చివరి నుంచి కోవిడ్‌ పుంజుకోవచ్చని అంచనా. మంగళవారం ఆయన మాట్లాడుతూ జూన్‌ నెల తరువాత గరిష్ట స్థాయి చేరుకుని సెప్టెంబర్, అక్టోబర్‌ నెలవరకూ కొనసాగవచ్చని ఆ నివేదికలో నిపుణులు తెలిపారు. వారు గతంలో మూడు మూడు దాడుల గురించి ఇచ్చిన నివేదిక శాస్త్రీయంగా ఉందని అన్నారు.  

మే 16 నుంచి బడులు పునఃప్రారంభం 
వచ్చే జూన్, జులై నెలల్లో కోవిడ్‌ నాలుగో దాడి రావచ్చని చెబుతున్నారు. కానీ విద్యాలయాలు ముందే నిర్ధారించినట్లు మే 16 నుంచి మొదలవుతాయి, ఇందులో సందేహం లేదు అని ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బీ.సీ.నాగేశ్‌ తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు.  

రాష్ట్రంలో 85 కరోనా కేసులు  
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 85 కరోనా పాజిటివ్‌ కేసులు, 70 డిశ్చార్జిలు నమోదయ్యాయి.  1,686 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 7,171 మందికి కరోనా పరీక్షలు చేశారు. బెంగళూరులో 82 కేసులు, 66 డిశ్చార్జిలు నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరు మాస్క్‌ ధరించాలని బీబీఎంపీ మార్షల్స్‌ మైకుల ద్వారా కోరడం మొదలైంది. పలు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్క్‌ ధరించండి అని మైకుల్లో ప్రచారం చేశారు. 

మరిన్ని వార్తలు