కోవిడ్‌ విధుల్లోని అంగన్‌ వాడీలకు 50 లక్షల బీమా 

6 Oct, 2021 06:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ సంబంధ విధుల్లో పాలుపంచుకునే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రూ.50 లక్షల బీమా కవరేజీ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్‌–19 అవగాహన, పర్యవేక్షణతోపాటు ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులను అందించే అంగన్‌వాడీ సిబ్బంది ఈ పథకం పరిధిలోకి వస్తారని మంగళవారం మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. విధుల్లో ఉండగా కోవిడ్‌తో చనిపోయినా, ప్రమాదవశాత్తూ మరణించినా వర్తిస్తుందన్నారు.

ఈ పథకం మహమ్మారి దేశంలో మొదలైన 2020 మార్చి 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కోవిడ్‌ విధుల్లో పాలుపంచుకునే అంగన్‌ వాడీ, ఏఎన్‌ఎం సిబ్బంది వివరాల కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగాలను కోరినట్లు చెప్పారు. దేశంలోని అంగన్‌వాడీల్లో సుమారు 13.29 లక్షల వర్కర్లు, 11.79 లక్షల మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. రూ.50 లక్షల బీమా వెసులుబాటు ప్రస్తుతం కోవిడ్‌ సంబంధ విధుల్లో పాల్గొంటున్న ప్రజారోగ్య సిబ్బందికి ఉంది. 

మరిన్ని వార్తలు