‘నోరు పొడిబారుతోంది.. ఊపిరాడటం లేదు.’

28 Jul, 2020 14:37 IST|Sakshi

లక్నో : చనిపోయే కొన్ని నిమిషాల ముందు కరోనా పేషెంట్‌ ఆస్పత్రిలో రికార్డు చేసిన ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని సౌకర్యాల కొరత కారణంగా తను అనుభవిస్తున్న బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. ఇందులో అతడు ఊపిరిపీల్చుకోడానికి ఇబ్బంది పడుతూ, షర్ట్‌ రక్తంతో తడిసిపోయినట్లు కన్పిస్తోంది. ఇక సోమవారం బాధితుడు మరణించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో కరోనా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల కల్పనపై యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం ఈ వీడియోను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు.  (పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం )

52 సెకన్ల ఈ వీడియోను ఝాన్సీ మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరిన కరోనా బాధితుడు సోమవారం చిత్రీకరించాడు. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘ఆస్పత్రిలో నీటికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా నోరు పొడిబారుతోంది. వెంటిలేటర్‌ వల్ల ఊపిరాడటం లేదు. నన్ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఇక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఏ విధమైన ఏర్పాట్లు లేవు. నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’. అని కరోనా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక  అతను మొబైల్ కెమెరాలో కోవిడ్ వార్డును చూపించినప్పుడు, అతని చుట్టూ ఎంతో మంది ఇతర రోగులు  ఆసుపత్రి పడకలపై పడి ఉన్నట్లు తెలుస్తోంది. (చివరి ప్రయాణానికి చేయూత)

అయితే దీనిపై స్పందించిన ఝాన్సీ ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ అధికారి జీకే నిగమ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. చిత్రీకరించిన వీడియోకు అతని మరణానికి మధ్య ఉన్న సమయ అంతరం స్పష్టంగా లేదని అన్నారు. మృతి చెందిన వ్యక్తి భార్య, కుమార్తె సైతం కోవిడ్‌ బారిన పడినట్లు.. వారు మరో వార్డులో వైద్యం పొందుతున్నట్లు వెల్లడించారు. కానీ వీడియోలో చేసిన ఆరోపణలపై మాత్రం అధికారి నోరు విప్పకపోవడం గమనార్హం. (టీ పెట్టుకుంటున్నా.. బట్టలు ఉతుక్కుంటున్నాను: సీఎం)

>
మరిన్ని వార్తలు