ప్లాస్మా దానంలో రికార్డు : ఎన్నిసార్లో తెలుసా?

25 Feb, 2021 10:24 IST|Sakshi
ప్లాస్మా దానం చేస్తున్న అజయ్‌ మునోత్‌

9 మంది ప్రాణాలు కాపాడిన ప్లాస్మా దాత 

50 ఏళ్ల వయస్సులో రికార్డు 

సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్‌ మునోత్‌ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కాపాడాడు. మార్కెటింగ్‌ కన్సల్టంట్‌గా కొనసాగుతున్న అజయ్‌కు 2020 జూన్‌ 28వ తేదీన కరోనా సోకింది. దీంతో పుణే డెక్కన్‌లోని సహ్యాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందా రు. ఇలా కరోనా నుంచి  విముక్తి పొందిన అనంతరం ఆయన ఆసుపత్రి వర్గాల అభ్యర్థనల మేరకు ఏకంగా తొమ్మిది సార్లు ప్లాస్మా దానం చేసి తొమ్మిది మందికి ప్రాణదానం చేశారు. ముఖ్యంగా కరోనా నుంచి విముక్తి పొందిన ఆయన  తొలిసారిగా 2020 ఆగస్టు 26వ తేదీన తన ప్లాస్మాను దానం చేయగా అనంతరం  సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రెండేసి అనగా మొత్తం నాలుగు సార్లు  ప్లాస్మాను దానం చేశాడు. 

ప్లాస్మా దానం చేయడానికి సుమారు 45 నిమిషాల సమయం  పడుతుంది. రక్త పరీక్షలు చేసి శరీరంలోని యాటిబాడీలను తెలుసుకుంటారు. అయితే ఈ రిపోర్డు రావడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. అనంతరం సేకరించిన రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి మిగిలిన రక్తాన్ని తిరిగి దాత శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా తన సమయాన్ని వెచ్చింది ప్లాస్మా దానంతో తొమ్మిది మందిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న అజయ్‌ను అనేక మంది అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

కొత్త రికార్డు...      
అజయ్‌ మునోత్‌ తొమ్మిది సార్లు దానం చేసి తొమ్మిది మందికి ప్రాణాలు కాపాడి కొత్త రికార్డును సృష్టించారని చెప్పవచ్చని సహ్యాద్రి ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంకు విభాగ ప్రముఖురాలు డాక్టరు పౌర్ణిమ తెలిపారు. ముఖ్యంగా ఆయన మా ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఆనందంగా ఉంది
నేను చేసిన ప్లాస్మా దానంతో తొమ్మిది మంది కోలుకున్నారని తెలిసి చాలా ఆనంద పడ్డాను. ఇంగ్లాండ్‌లో ఒక వ్యక్తి పది సార్లు, మన దేశంలోనే మరొక వ్యక్తి ఆరుసార్లు ప్లాస్మా దానం చేశారని ఇంటర్నెట్‌లో చూశాను. అయితే నా రికార్డు కోసం కాకుండా కరోనా బాధితులకు ఉపయోగ పడుతుందనే విషయమే నాకు ఎక్కువగా ఆనందం కలుగచేస్తుంది.   -అజయ్‌ మునోత్‌ 

 

మరిన్ని వార్తలు