Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన

14 Mar, 2022 14:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్నవాళ్లకు బుధవారం(మార్చి 16వ తేదీ) నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

12-14 ఏళ్ల మధ్య పిల్లలతోపాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మాన్షుక్‌ మాండవీయా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు.

కొత్త కేసులు.. 27 మరణాలే!

మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. భారత్‌లో Corona Deaths ఇప్పటి వరకు 5,15,877గా నమోదు అయ్యింది.

మరిన్ని వార్తలు