మోదీ ఫోటోను తొలగించండి: కేంద్ర ఎన్నికల సంఘం

6 Mar, 2021 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో నాలుగు రాష్ట్రాలతోపాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర  ఎన్నికల సంఘం​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరోనా వైరస్‌ టీకా వేసుకున్న తర్వాత వైద్యులు అందించే సర్టిఫికేట్‌పై ముద్రించిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫోటోతో కూడిన సర్టిఫికేట్ల వల్ల ఓటర్లు ప్రభావితం కావడానికి  అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని  నరేం‍ద్రమోదీ దుర్వినియోగం చేసున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అది ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకమని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం​ వ్యాక్సినేషన్‌ పూర్తైన అనంతరం వైద్యులు అందించే సర్టిఫికేట్‌పై నరేం‍ద్ర మోదీ ఫోటో తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఇక సోమవారం అరవై ఏళ్లు పైబడినవారికి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిందే. అదే విధంగా ఈ వ్యాక్సినేషన్‌లో పలువురు ప్రముఖులు కూడా కరోనా టీకా వేయించుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసొం​, పుదుచ్చేరిలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 

 
చదవండి: ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్‌ 

మరిన్ని వార్తలు