రోడ్డు ప‌క్క‌న బిర్యానీ చేస్తున్న మ‌హా వంట‌గాడు

28 Nov, 2020 20:05 IST|Sakshi

ముంబై: క‌రోనా మ‌నుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. దీంతో ఎంతోమంది జ‌నాల బ‌తుకులు రోడ్డు పాల‌య్యాయి. ఆ బాధితుల్లో ఒక‌రే అక్ష‌య్ పార్క‌ర్. ఈయ‌న చేయి తిరిగిన‌ వంట‌గాడు. ఇంట‌ర్నేష‌న‌ల్‌ స్టార్ హోట‌ల్‌లో ఆయ‌న‌ కింద ఎంద‌రో వంట‌గాళ్లు ఉండేవారు. తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లోనూ ప‌ని చేసేవాడు. కానీ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఎనిమిదేళ్లుగా ప‌ని చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ లేదు. ఇలాగైతే బ‌తుకు బండి ముందుకు సాగ‌ద‌ని తెల‌సుకున్న అక్ష‌య్ ముంబై వీధిలో చిన్న స్టాల్ పెట్టుకుని బిర్యానీ వండుతూ నాలుగు పైస‌లు సంపాదిస్తున్నాడు. (వైరల్‌ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు)

ఆయ‌న చేసే బిర్యానీ ఘుమ‌ఘుమ‌లు మిమ్మ‌ల్ని తిన‌నివ్వ‌కుండా వ‌దిలిపెట్ట‌వు. ప్ర‌స్తుతం ఆయ‌న స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్టార్ హోట‌ల్ నుంచి దిగి వ‌చ్చి వీధిలో బండి పెట్టుకోవ‌డం మామూలు విష‌యం కాద‌ని నెటిజ‌న్లు అత‌డిని కీర్తిస్తున్నారు. అత‌డి బిర్యానీ బండి వృద్ధిలోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఎంతైనా స్టార్ హోటల్ చెఫ్ కాబ‌ట్టి బిర్యానీ ధ‌ర కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంది. కిలో వెజ్ బిర్యానీ రూ.800 కాగా కిలో నాన్ వెజ్ బిర్యానీ రూ.900కు అమ్ముతున్నాడు. మీరూ ఆ బిర్యానీ రుచి చూడాలంటే ముంబై‌లోని దాద‌ర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. (వైరల్‌: యువతి తలను కోసుకుని తినొచ్చు!!)

మరిన్ని వార్తలు