ఏటీఎంలో నోట్ల వరద.. 8,000 డ్రా చేస్తే రూ.20 వేలు వచ్చాయి

3 Feb, 2023 17:28 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని అంబత్తూరులో ఓ ఏటీఎంలో నోట్లు పోటెత్తాయి. నమోదు చేసిన మొత్తం కంటే రెట్టింపు స్థాయిలో నోట్లు రావడంతో బ్యాంక్‌ అధికారులు సైతం విస్మయంలో పడ్డారు. వివరాలు.. అంబత్తూరులో ఓ జాతీయ బ్యాంక్‌ పక్కనే ఉన్న ఏటీఎంలో ఓ ఖాతాదారుడు రూ. 8 వేల డ్రా చేసేందుకు యత్నించగా.. ఆయనకు రూ. 20 వేలు వచ్చాయి.

ఇలా 10 మంది ఖాతాదారులకు ఇలా అధిక  మొత్తం రావడంతో బ్యాంక్‌ అధికారులకు సమాచారమిచ్చారు. తమకు అధికంగా వచ్చిన మొత్తాన్ని బ్యాంక్‌కు ఇచ్చేశారు. కాగా రూ. 200 నోట్లు నిల్వ ఉంచాల్సిన స్థానంలో, రూ. 500 నోట్లను ఏటీఎంలో పొందు పరచడంతోనే లెక్కల్లో తేడా వచ్చి ఖాతాదారులకు అధికంగా నగదు చేతికి వచ్చినట్లు విచారణలో తేలింది. దీనిపై బ్యాంక్‌ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.  

>
మరిన్ని వార్తలు