వీడియో: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’ మూత్రం తాగించి మరీ..

25 Nov, 2022 19:53 IST|Sakshi

క్రైమ్‌: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేశారు. 

ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్‌ 23వ తేదీన రాజస్థాన్‌ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది.

భరత్‌ కుమార్‌ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్‌ వైరింగ్‌ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్‌ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్‌ కోసం భరత్‌ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్‌ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. 

కోపంతో ఆ దాబా ఓనర్‌, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్‌పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్‌ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్‌. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

Video Credits: First India News 

మరిన్ని వార్తలు