గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్‌ రైలు.. 24 గంటల్లోనే రిపేర్‌

7 Oct, 2022 13:36 IST|Sakshi

ముంబై: గేదెలు ఢీకొట్టిన ప్రమాదంలో దెబ్బతిన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు బాగుచేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే రైలుకు మరమత్తులు నిర్వహించారు. దెబ్బతిన్న రైలు ముందు భాగంలోని మెటల్‌ ప్లేట్‌ను ముంబై సెంట్రల్‌లోని కోచ్ కేర్ సెంటర్‌లో మార్చారు. దీనిని ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌(ఎఫ్‌ఆర్‌పీ)తో తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అధికారులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

కాగా ముంబై నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా గురువారం అహ్మదాబాద్‌ సమీపంలో పట్టాలపై వెళ్తుండగా  గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోయినా రైలు ముందు భాగం ధ్వంసమైంది.  ఏకంగా ఇంజిన్‌ ముందు భాగం ఊడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 100 కి.మీ. వేగంతో ఉంది. అయితే రైలు ప్యానెల్ లేకుండానే గాంధీనగర్ స్టేషన్‌,  తిరిగి ముంబై సెంట్రల్‌కు సకాలంలో ప్రయాణించింది.

గాంధీనగర్‌-ముంబై సెంట్రల్‌ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్‌ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్‌ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా  ఉందని అధికారులు తెలిపారు. అయితే రైలు ప్రమాదానికి గురికావడంతో విపక్షాలు మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రారంభించిన 6 రోజుల్లోనే బర్రెలు ఢీకొడితేనే రైలు పార్టులు ఊడిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

మరిన్ని వార్తలు