బతకాలనే బలం ఆ చిన్నారే ఇచ్చింది.. కరోనాను జయించిన తల్లి కథ

12 Jun, 2021 17:02 IST|Sakshi

కరోనాతో  చనిపోయిన కథనాలు, చనిపోయినవాళ్లను అంత్యక్రియలు చేసే వార్తలు జనాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. కానీ, ధైర్యంగా పోరాడి చావును జయించిన స్వప్న తరహా కథనాలు అందరికీ తెలియాలని ఆమె భర్త అశిష్‌ కోరుకుంటున్నాడు.

ముంబై: నెలన్నరపాటు ఆస్పత్రిలో బెడ్‌పై.. పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులు.. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్‌ పై.. అది కూడా 100 శాతం కెపాసిటీతో ట్రీట్‌మెంట్‌ తీసుకుంది నాగ్‌పూర్‌ కు చెందిన 35 ఏళ్ల స్వప్న. ఆమె బతకడం కష్టమని డాక్టర్లు తేల్చడంతో ఆశలు వదులుకున్నారు అంతా. కానీ, ఆమె మాత్రం పోరాడింది. కరోనాను ఓడించి నవ్వుతూ కూతురి కౌగిలికి చేరుకుంది.  

నాగ్‌పూర్‌కు చెందిన గృహిణి స్వప్న ఏప్రిల్‌ 19న కరోనాతో క్రిమ్స్‌ హాస్పిటల్‌లో చేరింది. ఊపిరితిత్తులో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో పరిస్థితి విషమంగా తయారైంది. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. బతకడం ఇక కష్టమనుకున్న టైంలో అనుహ్యాంగా ఆమె కోలుకుంది. ‘ ఐదేళ్ల నా కూతురు లోరినానే నా ప్రేరణ. ఆమే నాకు బలానిచ్చింది. చావును జయించాలని పదే పదే గుర్తు చేస్తూ ఆమె నాకు ధైర్యాన్ని పంచింది’ అని చెప్తోంది స్వప్న రసిక్‌. 

కచ్చితంగా ఇదొక అరుదైన కేసు. అన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి బతకడం నిజంగా అద్భుతం. కూతురి మీద ప్రేమే ఆమెను బతికించింది అని స్వప్నకు ట్రీట్‌మెంట్‌ అందించిన డాక్టర్‌ పరిమల్‌ దేశ్‌పాండే చెప్తున్నారు.

మరిన్ని వార్తలు