తగ్గేదేలే.. చైనా, అమెరికాకు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

15 Apr, 2022 21:15 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. తూర్పు ల‌ఢ‌క్ విష‌యంలో చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ మేరకు డ్రాగన్‌ దేశానికి వార్నింగ్‌ ఇచ్చారు.  

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..  స‌రిహ‌ద్దుల్లో భార‌త సైనికుల‌ వీరోచిత సేవ‌ల‌ను ప్రశంసించారు. లఢక్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్‌’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్‌ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్‌ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్‌ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని.. విన్‌-విన్‌ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్‌ కోరుకుంటుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు