Delhi Horror: అమ్మాయిలను బయటకు గెంటేయడం వల్లే దారుణం.. హోటల్ యజమానిపై మహిళా కమిషన్ సీరియస్..

3 Jan, 2023 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చికెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూ ఇయర్ రోజున ఈఘటన జరిగింది. 

అయితే అంతకుముందు ఏం జరిగిందో ఓ హోటల్ యజమాని వివరించాడు. ఈ ఘటనలో చనిపోయిన యువతి(అంజలి) తన స్నేహితురాలు(నిధి)తో కలిసి హోటల్‌కు వచ్చిందని పేర్కొన్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, ఒకరితో ఒకరు గొడవపడి హోటల్లో రచ్చ చేశారని చెప్పాడు. ఇది చూసి ఇద్దరినీ బయటకు గెంటేసినట్లు వెల్లడించాడు.

హోటల్ ఓనర్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. బాధితురాలిపై నిందలు మోపడం సరికాదన్నారు. అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలను బయటకు ఎలా గెంటేస్తారని ప్రశ్నించారు. ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉన్నారనేందుకు ఆధారాలేంటని? అడిగారు.

అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులను హోటల్‌ నుంచి గెంటేయడం కంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని స్వాతి ‍అన్నారు. అలా చేసి ఉంటే యువతి చనిపోయి ఉండేది కాదన్నారు. హోటల్‌ నుంచి వాళ్లను బయటకు పంపడం వల్లే ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు.

జనవరి 1న ఉదయం 1:30 గంటల సమయంలో ఇద్దరు యువతులు హోటల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీటీవీ రికార్డులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి ‍స్కూటీని కారు ఢీకొట్టింది. చక్రాల మధ్య ఇరుక్కున్న ఆమెను గుర్తించకుండా ‍మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో యువతి చనిపోయింది. తెల్లవారుజామున ఆమె మృతదేహం నగ్నంగా రోడ్డుపై కన్పించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..

మరిన్ని వార్తలు