మత్తులో మనోళ్లు

29 Nov, 2020 06:17 IST|Sakshi

ప్రపంచం టాప్‌–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై

ప్రథమ స్థానంలో న్యూయార్క్‌

సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్‌ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి.  

టాప్‌–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై..
జర్మనీకి చెందిన మార్కెట్‌ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్‌ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం..
► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్‌ వినియోగం న్యూయార్క్‌ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు.  

► పాకిస్తాన్లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు.  

► ప్రపంచంలోని టాప్‌–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్‌ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు.  

► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి.

5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌..
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్‌ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్‌సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.  

రోజుకు 23 మంది మృతి..
ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్‌ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్‌ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్‌సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్‌ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్‌ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.  

మరిన్ని వార్తలు