సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే

31 Jul, 2021 06:24 IST|Sakshi

ఢిల్లీ శాసనసభలో తీర్మానం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఢిల్లీ శాసనసభ పునరుద్ఘాటించింది. ఈ మేరకు శుక్రవారం సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా దీనికి మద్దతు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా, ప్రస్తుతం ఆప్‌నకు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు.

కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రైతన్నలు శాంతియుతంగా పోరాటం సా గిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని శాసనసభ విమర్శించింది. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీరించాలని డిమాండ్‌ చేసింది. వారితో చర్చించాలని, సమస్యలను పరి ష్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొనేలా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ఆన్నదాతల మద్దతు సంపాదించేందుకు ఢిల్లీలో శాసనసభలో తాజాగా తీర్మానం చేసినట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు