బాణసంచా కొన్నా, కాల్చినా రూ.200 ఫైన్‌, 6 నెలల జైలు శిక్ష!

19 Oct, 2022 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటేనే బాణసంచా ఉండాల్సిందే. అయితే, పండుగకు ముందు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్‌ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు.. 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్‌ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అక్టోబర్‌ 21న ‘ దీపాలు వెలిగించండి.. పటాకలు కాదు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రాయ్‌. వచ్చే శుక్రవారం సెంట్రల్‌ పార్క్‌ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. ‘ఫైర్‌క్రాకర్స్‌ కొనుగోలు చేయటం, కాల్చటం చేస్తే రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం.  ’ అని స్పష్టం చేశారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఫైర్‌క్రాకర్స్‌ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి: మోడ్రన్‌ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు