Delhi: నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

31 Aug, 2021 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ.. అన్ రాక్ అల్యూమినియం కంపెనీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అన్ రాక్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించినట్లు బుగ్గన పేర్కొన్నారు. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ను సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

చదవండి: ఆస్తుల నగదీకరణ ఎందుకు ?

న్యాయపరంగా కేసు పరిష్కారమైతే ఒక పెద్ద కంపెనీ రాష్ట్రానికి వస్తుందన్నారు. అంతే కాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వీటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది సీఎం జగన్ ఉద్దేశం అని తెలిపారు. పోలవరం అంశం నిధుల విడుదల ప్రోగ్రెస్‌లో ఉందన్నారు. 

రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరోపణలు
మ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం పాడైపోయిన పర్వాలేదనే తరహాలో  టీడీపీ ఆలోచిస్తోందని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన దుయ్యబట్టారు. టీడీపీ దుర్మార్గానికి  మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అప్పులపై తెలుగుదేశం పార్టీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకొచ్చామని, తెలుగుదేశం హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి బుగ్గన  అన్నారు. కరోనా కారణంగా పెరగాల్సిన ఆదాయం పడిపోయిందని, అందుకే ఈ పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోందని, ఆ పార్టీ ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం  చేశారు.

చదవండి: డిపాజిటర్లకు మరింత రక్షణ

మరిన్ని వార్తలు