ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ రేటు భారీగా తగ్గించిన కేజ్రీవాల్‌

30 Nov, 2020 18:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ రాజధాని ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తోన్న కరోనా టెస్ట్‌ ఫీజును భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ నిర్థారణలో కీలక పాత్ర పోషించే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ ఫీజును తగ్గిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరీక్షను ఉచితంగా చేస్తుండగా.. ప్రైవుటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో మాత్రం 2,400 వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌ ‘ఢిల్లీలో ప్రైవేట్‌ ల్యాబుల్లో నిర్వహిస్తోన్న ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ రేటును తగ్గించాల్సిందిగా ఆదేశించాను. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఇక ప్రైవేట్‌లో టెస్ట్‌ చేయించుకునే వారికి ఈ నిర్ణయంతో మేలు కలగనుంది’ అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోవిడ్‌ టెస్ట్‌ రేట్లను తగ్గించింది. (చదవండి: కరోనా వ్యాప్తిని తగ్గించే దిశగా కేజ్రీవాల్‌ చర్యలు)

ఇక ఢిల్లీలో సెప్టెంబర్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండటంతో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో పని లేకుండానే కోవిడ్‌ టెస్టులు చేయించుకోవచ్చని కేజ్రీవాల్‌ ప్రభుత్వం తెలిపింది. టెస్టు చేయించుకోవడానకి వచ్చే వారు ఢిల్లీలోనే నివసిస్తున్నట్లు తెలపడం కోసం ఆదార్‌ కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. అంతేకాక వారు ఐసీఎంఆర్‌ ఇచ్చిన ఫామ్‌లను ఫిల్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు