కరోనా: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య

14 May, 2021 15:32 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ ఢిల్లీపై మొన్నటి వరకు తీవ్ర ప్రభావాన్నే చూపించింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ కారణంగా కుటుంబంలో సంపాదించే వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే విధంగా కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నాడు వర్చువల్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తోందని కొత్త కోవిడ్ కేసుల సంఖ్య 8,500కు తగ్గిందని, పాజిటివిటీ రేటు సుమారు 12 శాతానికి చేరిందని పేర్కొన్నారు.

‘కరోనాతో పోరాటం ముగియలేదు. అలసత్వం చూపరాదు. కరోనా బారినపడి చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. వారి కోసం నేను ఇంకా ఉన్నాను. మీరు అనాథలని భావించొద్దు. ఇలాంటి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణతోపాటు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. అలాగే కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన పెద్దవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు పిల్లలమీదే ఆధార పడి ఉంటారు. వాళ్లకి ఈ కొడుకు కేజ్రీవాల్ ఉన్నాడు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటాం’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

చదవండి:
'ఆ సమయంలో నా బిడ్డ ఎంత బాధ అనుభవించిందో’
‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్‌ ట్యూన్‌ ఎందుకు?’’

మరిన్ని వార్తలు