న్యూఢిల్లీ: తమ వద్ద వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ప్రతి నెలా 80-85 లక్షల వ్యాక్సిన్లు కావాలని చెప్పారు. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టిన సంస్థల నుంచి స్పందన లేదు అని అసహనం వ్యక్తం చేశారు. సుమారు 300 పాఠశాలలను వ్యాక్సినేషన్ కోసం ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీలో తాజా పరిస్థితులపై శనివారం మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
రాబోయే థర్డ్వేవ్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. చిన్నారులకు కూడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీకి మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని చెప్పారు. మూడు నెలల్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. రోజుకు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పాటు ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ సరఫరా లేక బాధితులు మృత్యువాత పడుతున్న సంఘటనలు చూస్తునే ఉన్నాం.
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?