పేరెంట్స్‌కు కరోనా.. ఒంటరైన చిన్నారి..ఒక్క ఫోన్‌ కాల్‌తో..

10 May, 2021 10:58 IST|Sakshi

మానవత్వం చాటిన హెడ్‌ కానిస్టేబుల్‌ రాఖీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు రోజురోజుకి అధికమవుతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వైరస్‌ బారినపడి దేశ రాజధానిలో ఇప్పటివరకు 19 వేల మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు. ఈక్రమంలోనే మాతృ దినోత్సవం రోజున ఢిల్లీలో ఓ హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. జీటీబీ నగర్‌లోని రేడియో కాలనీలో నివసిస్తున్న భార్యభర్తలకు కోవిడ్‌ సోకగా, వారి ఆరునెలల బేబీకి నెగెటివ్‌ వచ్చింది.

అయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో వారి బంధులు బేబీ సంరక్షణ కోసం రావడానికి వీలుకాలేదు. తమ బిడ్డను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో మీరట్‌కి చెందిన వీరి బంధువు ఒకరు ఈ విషయాన్ని షాహదారా డీసీపీ కార్యాలయంలో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ రాఖీ దృష్టికి ఫోన్‌ ద్వారా తీసుకొచ్చారు.

ఆ భార్యాభర్తలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే స్పందించిన రాఖీ.. సీనియర్‌ పోలీస్‌ అధికారులకు సమాచారం అందించి జీటీబీ నగర్‌కు చేరుకుంది. జాగ్రత్తగా ఆ బేబీని ఉత్తరప్రదేశ్‌లోని మోడీ నగర్‌లో  నివసిస్తున్న  అమ్మమ్మకు అప్పగించింది. ఇక హెడ్‌ కానిస్టేబుల్‌ రాఖీ సాయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లి మనసు మరో మహిళకే తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు