మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి

2 Jun, 2021 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై మద్యం ఇంటికే డెలివరీ కానుంది. యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే మద్యం ఇంటికి చేరుకొనేలా ఢిల్లీ ప్రభుత్వం చట్టం చేయనుంది. ఢిల్లీ ఎక్సైజు నియమాల సవరణ చట్టం –2021 ద్వారా ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్‌ ప్రటనను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బహిరంగంగా అమ్మే లైసెన్సు కలిగిన హోటళ్లు, క్లబ్బులు, బార్ల నుంచి సైతం మద్యాన్ని బాటిళ్ల ద్వారా అందుకునే వీలు ఈ చట్టం ద్వారా కలగనుంది. యాప్, వెబ్‌సైట్‌ ద్వారా చేసిన ఆర్డర్లకు మాత్రమే డెలివరీ సదుపాయం ఉంటుంది.

కేవలం ఇంటి చిరునామాలకు మాత్రమే డెలివరీ చేయనున్నారు. ఆఫీసులు, సంస్థలు, హోటళ్లకు మాత్రం డెలివరీ ఉండదు. ఈ నిర్ణయాన్ని భారత ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) స్వాగతించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేరుతో ఢిల్లీ ఆర్థిక విభాగం ఈ ప్రకటనను జారీ చేసింది.

దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ మండిపడ్డాయి. ఇలా మద్యాన్ని ఇళ్లకు డెలివరీ చేయడం దేశ సంస్కృతికి విరుద్ధమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ. నగరంలో కోవిడ్‌ 19ను అరికట్టడానికి బదులు కేజ్రీవాల్‌ ప్రభుత్వం మద్యాన్ని డెలివరీ చేయడంలో బిజీగా ఉందంటూ విమర్శించారు.   
చదవండి: తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు

మరిన్ని వార్తలు