మద్యం పాలసీలో పెను మార్పులు చేసిన ప్రభుత్వం

22 Mar, 2021 18:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం‌ పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి మనిష్‌ శిశోడియా కొత్త మద్యం పాలసీపై మాట్లాడుతూ.. మందు తాగే చట్టబద్ధమైన వయసును 25 నుంచి 21 మార్చటానికి ప్రభుత్వం నిశ్చయించిందని అన్నారు. కొత్త నియమాల ప్రకారం రాజధానిలోని పేర్లులేని మద్యం షాపులు ఇకపై పనిచేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పాత మద్యం షాపులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అన్నారు. రాజధానిలోకి అక్రమ మద్యం రాకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర రెవెన్యూను 20 శాతం పెంచుతామని పేర్కొన్నారు.

మంత్రుల సంఘం సూచనల మేరకు రాష్ట్ర కేబినేట్‌ ఈ కొత్త పాలసీలను ఆమోదించిందని తెలిపారు. రాజధానిలో కొత్తగా ఏ మద్యం షాపు తెరవటానికి వీల్లేదని, ప్రభుత్వం ఏ మద్యం షాపును నడపబోదని వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలోని 60 శాతం మద్యం షాపులను ప్రభుత్వం నడుపుతోందని చెప్పారు. నకిలీ మద్యాన్ని గుర్తించటానికి నగరంలో ఓ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

చదవండి : ఆ ప్రాజెక్ట్‌తో బుందేల్ఖండ్‌‌ రూపురేఖలు మారతాయి

మరిన్ని వార్తలు