కవిత విచారణకు ముందర.. బిగ్‌ ట్విస్ట్‌, పిళ్లై పిటిషన్‌తో ఈడీకి నోటీసులు

10 Mar, 2023 13:25 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు పిటిషన్‌ దాఖలు వేశారు ఈ కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై. దీంతో ఈడీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. 

లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన పిళ్లై.. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో స్పందించాలంటూ ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. 

ఇదిలా ఉంటే.. లిక్కర్‌ స్కాంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ పిళ్లైను ఈడీ అరెస్ట్‌ చేసి ప్రశ్నించింది. ఈ క్రమంలో.. పిళ్లై , బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాను బినామీ అని, ఆమె ప్రయోజనాల కోసమే పని చేశానంటూ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడంటూ ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. 

ఆపై లిక్కర్‌ స్కామ్‌లో కవితను ప్రశ్నించేందుకు నోటీసులు కూడా పంపింది. రేపు అంటే శనివారం ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది కూడా.  ఈ తరుణంలో ఇప్పుడు పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరడం గమనార్హం.

మరిన్ని వార్తలు