Delhi Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌.. ముగిసిన అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కస్టడీ.. కోర్టు ఏం చెప్పిదంటే!

24 Nov, 2022 15:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితులైన బోయినపల్లి అభిషేక్‌ రావు, విజయ్‌ నాయర్‌ ఈడీ కస్టడీ ముగిసింది. కస్టడీ ముగియడంతో ఇద్దరిని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పెషల్‌ కోర్టులో హాజరుపరిచింది. విజయ్‌ నాయర్‌ ల్యాప్‌టాప్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. డేటా రికవరీ జరగుతోందని వెల్లడించింది. లిక్కర్‌ స్కామ్‌లో ల్యాప్‌టాప్‌ నివేదిక కీలకమని, రూ.100కోట్లు చేతులు మారినట్లు కోర్టుకు తెలిపింది.  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి ల్యాబ్‌టాప్‌ రిపోర్టు శుక్రవారం వస్తుందని పేర్కొంది.

ఈడీ విచారణకు విజయ్‌ నాయర్‌ సహకరిస్తున్నారని, ఇప్పటికే అన్ని వివరాలు చెప్పారని తెలిపింది. మెయిల్ వివరాలు, ల్యాప్ టాప్ పాస్ వర్డ్ కూడా ఇచ్చారని చెప్పింది. అతన్ని ఇంకా ప్రశ్నించాల్సి ఉందని  చెబుతూ మరో అయిదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. విజయ్‌ నాయర్‌ను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది.

 అదే విధంగా అభిషేక్‌ రావుకు స్పెషల్‌ కోర్టు డిసెంబర్ 8 వరకు(14 రోజులు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అభిషేక్‌కు జైలులో చలి దుస్తులు, అవసరమైన పుస్తకాలు, మందులు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. 

సీబీఐకి చుక్కెదురు
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. లిక్కర్‌ స్కామ్‌లో నిందితులైన అభిషేక్‌, విజయ్‌ నాయర్‌లకు నవంబర్‌ 14న రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టు కోరింది. అయితే ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
చదవండి: అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు: సుప్రీం కోర్టు

మరిన్ని వార్తలు