ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు

18 Feb, 2023 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు పంపింది. డిల్లీలోని ప్రధాన  కార్యాలయంలో ఆదివారం విచారణకు రావాలని ఆదేశించింది.  సిసోడియాపై తాజాగా లభించిన ఆధారాలు చూసే ఆయనకు సీబీఐ నోటీసులు పంపినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. 

తనకు నోటీసులు పంపిన విషయాన్ని సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీబీఐ తనను మరోసారి విచారణకు పిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఈడీ, సీబీఐని తనపైకి ప్రయోగిస్తోందని విమర్శించారు. 

'నా ఆఫీసు, ఇల్లు వెతికారు. బ్యాంకు లాకర్ చెక్ చేశారు. కానీ నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఢిల్లీ పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నా. కానీ వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా. దాన్నే కొనసాగిస్తా.' అని సిసోడియా ట్వీట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముడుపులు తీసుకుని కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలకు మార్పులు చేశారని ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతేడాది ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించింది.
చదవండి: బ్రెడ్‌ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు!

మరిన్ని వార్తలు