Delhi Liquor Scam: ఈడీ రెండో చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరు

2 Feb, 2023 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. లిక్కర్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్‌ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది వివరంగా తెలిపింది.

చార్జ్‌షీట్‌లో చేర్చిన 17 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు:
A1 - సమీర్‌ మహేంద్రు
A2 - సమీర్‌కు చెందిన రెస్టారెంట్‌ ఖావోగాలి
A3 - సమీర్‌కు చెందిన బబ్లీ బేవరేజేస్‌
A4 - సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌
A5 - సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌
A6 - విజయ్‌ నాయర్‌
A7 - శరత్‌ చంద్ర
A8 - శరత్‌కు చెందిన ట్రైడెంట్‌ చెంపార్‌
A9 - శరత్‌కు చెందిన అవంతిక కాంట్రాక్టర్స్‌
A10 - శరత్‌కు చెందిన అర్గనామిక్స్‌ ఎకోసిస్టమ్స్‌
A11 - బినయ్‌ బాబు
A12 - రాజేశ్‌ మిశ్రాకు చెందిన పెర్నార్డ్‌ రికర్డ్‌
A13 - అభిషేక్‌ బోయిన్‌పల్లి
A14 - అమిత్‌ అరోరా
A15 - అమిత్‌కు చెందిన KSJM స్పిరిట్స్‌
A16 - అమిత్‌కు చెందిన బడ్డీ రిటైల్స్‌
A17 - అమిత్‌కు చెందిన పాపులర్‌ స్పిరిట్స్‌

ఆప్‌కు వంద కోట్ల ముడుపులు
కోర్టులో దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో కుట్ర జరిగిన తీరును ఈడీ సవివరంగా పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్‌ అద్మీ పార్టీకి చేరాయని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా ఇందులో పేర్కొంది. లంచంగా వచ్చిన వంద కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్‌ అద్మీ పార్టీ ఉపయోగించిందని ఆరోపించింది. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పని చేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు పేర్కొంది.

చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేర్లు
ఇక ఇదే ఛార్జ్ షీట్‌లో కుట్ర గురించి వివరించిన ఈడీ ఓ చోట ఎమ్మెల్సీ కవిత గురించి ప్రస్తావించింది. నవంబర్‌ 12, 2022న అరుణ్‌పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని పేర్కొంది. అరుణ్‌ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారని తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన రెండు ఫోన్ నెంబర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఈడీ.

అలాగే ఎంపీ మాగుంట పేరు కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో ఉంది. ఒబెరాయ్‌ హోటళ్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని తెలిపింది. ఆమ్‌ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. 


చదవండి: పోలవరంపై ఎంపీ వంగా గీత ప్రశ్న.. కేంద్రమంత్రి సమాధానమిదే

మరిన్ని వార్తలు