బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం

23 Feb, 2023 13:16 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్ కుమార్‌కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల మేరకు పీఏను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ను పేరును ఈడీ ప్రస్తావించింది. తాజాగా ఆయన వ్యక్తిగత కార్యదర్శిని విచారించడం చర్చనీయంశంగామారింది.

కాగా, సౌత్‌ గ్రూపు నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌నాయర్‌ తన మనిషి అని, విజయ్‌ను నమ్మొచ్చని ఫేస్‌టైం కాల్‌లో సమీర్‌ మహేంద్రుతో కేజ్రీవాల్‌ అన్నారని పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఎవరెవరు కలిసిందీ, ఎవరెవరు ఫోన్‌లో మాట్లాడిందీ తెలిపింది.

స్కామ్‌లో కీలక వ్యక్తులతో పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి స్టేట్‌మెంట్లను చార్జిషీట్‌కు ఈడీ జత చేసింది. అరుణ్‌పిళ్‌లై కవిత తరఫు ప్రతినిధిగా ఇండో స్పిరిట్స్‌లో చేరారని తెలిపింది. సౌత్‌ గ్రూపునకు చెందిన కవిత, మాగుంట, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిలు ఎవరెవరితో మాట్లాడారు? ఎవరెవరితో ఎక్కడ సమావేశమయ్యారన్న అంశాలు పొందుపరిచింది. కిక్‌బ్యాక్‌ల రూపంలో ముందుగా పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టాలనే అంశాన్ని పెట్టుబడిదారులు చర్చించారని పేర్కొంది.

విజయ్‌నాయర్‌ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసు పెట్టడానికి తగిన కారణాలున్నాయని తెలిపింది. సౌత్‌ గ్రూపునుంచి ఆప్‌ నేతలకు సొమ్ములు ఎలా చేరాయో వివరించింది. ఎవరెవరిని ఏయే కారణాలతో అరెస్టు చేసిందీ తెలియజేసింది. సౌత్‌గ్రూపు నుంచి తీసుకున్న రూ.100 కోట్లలో రూ.30 కోట్లు గోవా ఎన్నికలకు ఆప్‌ ఖర్చు చేసినట్లు ఆరోపించింది.
చదవండి: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం   

మరిన్ని వార్తలు