కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది

7 Oct, 2021 12:47 IST|Sakshi

ఢిల్లీ: కోతుల బెడతతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కున్న ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే తాజాగా కోతి చేసిన పని వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు విచారణలో.. ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి ఇంటిపై నుంచి ఇటుక పడిందని తేలింది. దీంతో అతన్ని విచారించగా..  ఆ ఇటుకలను తాను ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌పై పెట్టినట్లు అంగీకరించాడు.

అక్కడ కోతులు నిత్యం ట్యాంక్‌ మూత తీస్తుంటాయని మూత రాకుండా ఉండేందుకే ఆ ఇటుకలు పెట్టానని అన్నాడు. ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చదవండి: కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్‌ చేసి..

మరిన్ని వార్తలు