ఢిల్లీ నైట్‌ కర్ఫ్యూ: ఎవరికి సడలింపు..?

7 Apr, 2021 17:38 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశ రాజధాని ఢిల్లీలో విధించిన నైట్‌ కర్ఫ్యూ సమయంలో సామాన్య ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు. అయితే నైట్‌ కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైన సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానీ, సాధారణ వైద్య సేవలు కానీ, కూరగాయలు, పాలు మొదలైన ముఖ్యమైన వస్తువుల సరఫరాపై ఎటువంటి పరిమితి ఉండదు. డాక్టర్లు, నర్స్, పోలీసులు, పారామెడికల్‌ సిబ్బంది, ప్రింట్‌ మరియు ఎలక్ట్రిక్‌ మీడియా జర్నలిస్ట్, విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణీకులకు టికెట్‌ చూపిస్తే వారికి మినహాయింపు ఉంటుంది. 

నైట్‌ కర్ఫ్యూలో కరోనా వ్యాక్సిన్‌ కూడా పొందగలుగుతారు. కానీ దీనికి పాస్‌ తీసుకోవలసి ఉంటుంది. అంతేగాక అనవసరమైన పని నుండి బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటారు. రాత్రి 10 గంటల తరువాత ఫ్యాక్టరీ / కంపెనీలు పనిచేయవు. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు ఉండవు. రాత్రి 10 గంటల అనంతరం రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర దుకాణాలు మూసేయాల్సి ఉంటుంది. మతపరమైన స్థలాలు సైతం రాత్రి పూట మూతబడుతాయి. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి జరిమానా విధిస్తారు.

 

పెరుగుతున్న సంక్రమణ రేటు..
నాలుగు నెలల తరువాత, సంక్రమణ రేటు 5.54 శాతానికి చేరుకుంది. ఇది గత 125 రోజుల్లో అత్యధికం. అంతకుముందు డిసెంబర్‌ 1న సంక్రమణ రేటు 6.85 శాతంగా ఉంది. ఇప్పుడు మరోసారి సంక్రమణ రేటు ఐదున్నర శాతం దాటింది. ఈ కారణంగా దేశ రాజధానిలో కరోనా వైరస్‌ సంక్రమణ నియంత్రణ కోల్పోయింది. అంతేకాక మంగళవారం 5,100 కొత్త కేసులు నమోదయ్యాయి. సంక్రమణ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువౌతోంది. దీంతో ఆసుపత్రులలో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా మహమ్మారి సంక్రమణతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతాల్లో మినీ లాక్డౌన్‌ ప్రకటించగా,యూపీ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సమూహాల్లో జరిగే భారీ కార్యక్రమాలను నిషేదించాయి. 

ఇక్కడ చదవండి:
కరోనా ఉధృతి: ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన

కోవిడ్‌ పంజా; బెంగళూరులో ప్రాణవాయువుకు గిరాకీ

మరిన్ని వార్తలు