'మోదీ హఠావో దేశ్ బచావో..' అంటూ ఢిల్లీలో వేల బ్యానర్లు.. 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు

22 Mar, 2023 13:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫుటోవర్‌లు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, రోడ్లు ఇలా అనేక చోట్ల మోదీ హఠావో దేశ్ బచావో(మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి) అంటూ ప్లెక్సీలు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి.

ఢిల్లీ  పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగించారు. మొత్తం 100కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే ఇలాంటి బ్యానర్లు లక్షకుగా పైగా ముద్రించాలని రెండు ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మంగళవారం 10వేల పోస్టర్లను కూడా సీజ్ చేశారు. వీటిని వ్యానులో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు గానీ, ఎవరు ముద్రించారనే వివరాలు గానీ లేవు.

మోదీ వ్యతిరేక బ్యానర్లకు సంబంధించి 100 ఎఫ్‌ఐర్‌లు నమోదు చేయడంతో పాటు, ఆరుగురుని  అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పథాక్ తెలిపారు.  ఆప్ కార్యాలయం నుంచే వ్యాన్ వెల్లిందని పేర్కొన్నారు.

ఆప్‌ సెటైర్లు..
మరోవైపు మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. కేంద్రం నియంత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. ఆ పోస్టర్లలో ఏం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నమోదు చేశారు మోదీజీ? అని ప్రశ్నించింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అని బహుశా ప్రధాని మర్చిపోయినట్టున్నారని సెటైర్లు వేసింది.  ఈమేరకు ట్వీట్ చేసింది.

చదవండి: కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్‌ లింక్‌ చేశారా?

మరిన్ని వార్తలు