‘‘పీజీ పూర్తి చేశాను.. కూలి పని చేయడానికి సిద్ధం’’

31 May, 2021 15:40 IST|Sakshi

వైరలవుతోన్న పీజీ విద్యార్థి అభ్యర్థన

ఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఉపాధి కోల్పోయి ఎందరో రోడ్డున పడ్డారు. విద్యా సంస్థలు మూత పడ్డాయి. చదువులు ఆగిపోయాయి. పూర్తయిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో పీజీ పూర్తి చేసి.. రోజు కూలీగా మారిన ఓ యువకుడి ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. వికాశ్‌ అనే వ్యక్తి  ఢిల్లీలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సదరు యువకుడు లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక రోజు కూలీగా మారినట్లు వెల్లడించాడు. తనకు ఏదైనా ఉద్యోగం చూడాల్సిందిగా అభ్యర్థించాడు. 

‘‘దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. లాక్‌డౌన్‌లో రోజులు వెల్లదీయడం చాలా కష్టంగా మారింది. కొద్ది రోజులు డ్రైవర్‌గా చేశాను. కూలీ పని చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ ఆ పని కూడా దొరకడం లేదు. దయచేసి నాకు సాయం చేయండి’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా అభ్యర్థించాడు. తన రెజ్యూమ్‌ కూడా షేర్‌ చేశాడు. 

ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. వందల మంది వికాశ్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నీ బాధ అర్థం అవుతుంది.. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను.. నిజంగా ఇది హృదయవిదారకం.. నాకు తెలిసిన కొందరి కాంటాక్ట్‌ నంబర్లు ఇక్కడ షేర్‌ చేస్తున్నాను. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను. నీవు ఒంటరిగా లేవు.. నీకు మా అందరి మద్దతు ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నాను నెటిజనులు.

చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు

మరిన్ని వార్తలు