ఢిల్లీ రాజ్‌పథ్‌ పేరు మార్చిన కేంద్రం.. ఈ తోవ చరిత్ర తెలుసా?, కొత్త పేరు ఏంటంటే..

5 Sep, 2022 21:01 IST|Sakshi

ఢిల్లీ: దేశరాజధానిలోని చారిత్రక మార్గం రాజ్‌పథ్‌ పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌పథ్‌, సెంట్రల్ విస్టా లాన్‌ పేరును ‘కర్తవ్యపథ్‌’గా అధికారికంగా మార్చబోతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ మున్సిపల్‌ (NDMC) సెప్టెంబర్‌ 7వ తేదీన నిర్వహించబోయే ప్రత్యేక సమావేశంలో.. కౌన్సిల్‌ ముందుకు రాజ్‌పథ్‌ పేరుమార్చే ప్రతిపాదన బిల్లు రానుంది.

ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహం నుంచి.. రాష్ట్రపతి భవన్‌ వద్ద దాకా ఉన్న రోడ్డును రాజ్‌పథ్‌గా వ్యవహరిస్తారననది తెలిసిందే. బ్రిటిషర్ల కాలంలోనే రాజమార్గంగా రాజ్‌పథ్‌ను ఉపయోగించడం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున పునరుద్ధరించిన రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్‌లు కొత్త రూపాలతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. కొత్త పేరును సైతం వాడుకలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చింది బ్రిటీష్‌ వైశ్రాయ్‌ పాలన. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్‌ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్‌ చక్రవర్తి జార్జ్‌ 5 వచ్చారు. ఆ టైంలోనే రాజ్‌పథ్‌ వాడుకలోకి వచ్చింది. అయితే 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా..  బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ నెల 8న సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు స్ట్రెచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

లండన్‌లో జార్జ్‌ 5 తండ్రి ఎడ్వర్డ్‌ 7 స్మారకార్థం 1905లో  కింగ్స్‌వేను ప్రారంభించారు. రాజ్‌పథ్‌ దీనినే పోలి  ఉంటుంది. అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వేను హిందీ భాషకు అనుగుణంగా రాజ్‌పథ్‌ అని మార్చేశారు. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్‌ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, ఫార్మల్‌గా రాజ్‌పథ్‌ అనే పేరే కొనసాగుతోంది. త్వరలో అది కర్తవ్య పథ్‌గా మారనుంది.

ల్యాండ్‌మార్క్స్‌
రాష్ట్రపతి భవన్‌, సెక్రటేరియెట్‌ భవనం, విజయ్‌ చౌక్‌, ఇండియా గేట్‌, నేషనల్‌ వార్‌ మెమోరియల్‌.. రాజ్‌పథ్‌కు గుర్తులుగా ఉన్నాయి. కొత్త రూపం సంతరించుకోనున్న రాజ్‌పథ్‌ వెంట రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్‌, గ్రానైట్‌ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్‌ జోన్లు, పార్కింగ్‌ స్థలాలు, రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీ ఉండనుంది.

ఇదీ చదవండి:  అర్షదీప్ సింగ్‌కు ఖలిస్తాన్‌ లింక్‌ అంటగట్టడంపై కేంద్రం సీరియస్‌

మరిన్ని వార్తలు