న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..

20 May, 2021 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులు కారణంగా దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీ నగరం కాస్త చల్లబడడంతో మే నెలలో ఏకంగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. దీంతో గత 70 ఏళ్లలో మే నెలలో ఇంత స్వల్ప స్థాయికి చేరడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో కాలుష్యం కారణంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు ప్రతీ ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇంత​​కుముందు 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలే అత్యల్పంగా ఉండేది. కానీ ప్రసుత టౌటే తుపాను ప్రభావం వర్షాలు కురవడం వాతావరణం చల్లబడడంతో దేశరాజధానిలో 70 ఏళ్ల రికార్డు చెరిగిపోయిందని ఐఎండీ ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు.  ఈ మధ్యలో 1982 మే 13 న 24.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయి నమోదైందని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత నమోదైన ఉష్ణోగ్రత 1951 కంటే అత్యల్పమని ఆయన అన్నారు. 

35 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షాలు
ఢిల్లీలో టౌటే తుపాను కారణంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 60 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లలో బుధవారం కురిసిన వర్షపాతం టౌటే తుపాను, పాశ్చాత్య కారణాల ఫలితంగా ఏర్పడిందని ఐఎండి తెలిపింది.

ఇంతకుముందు 1976 లో మే 24 న 24 గంటల వ్యవధిలో రాజధాని 60 మిమీ వర్షపాతం నమోదైంది. నిన్నటి వర్షపాతంతో, ఇప్పటి వరకు ఉన్న మునపటి గణాంకాలను ఇది చెరిపేసిందని జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె జెనమణి అన్నారు. మే నెలలో వాతావరణం పొడిగా ఉంటుంది, సాధారణంగా ఈ నెలలో ఢిల్లీలో గరిష్ఠంగా 30-40 మిల్లీ మీటర్ల వర్షం (24గంటల్లో) నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫానుకు పాశ్చాత్య అవాంతరాలు తోడవడంతో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైందని ఆయన చెప్పారు.

చదవండి: ఢిల్లీ సీఎం ట్వీట్‌పై సింగపూర్‌ విదేశాంగ మంత్రి ఫైర్‌

మరిన్ని వార్తలు