Narendra Modi Birthday: 56 వంటకాలతో మోదీ థాలి

17 Sep, 2022 06:16 IST|Sakshi

ఇద్దరు విజేతలకు రూ.8.5 లక్షలు

ఉచితంగా కేదార్‌నాథ్‌ యాత్ర

ప్రధాని జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఓ రెస్టారెంట్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఓ రెస్టారెంట్‌ వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. ‘‘శనివారం నుంచి 26వ తేదీ దాకా 56 రకాల ఉత్తరాది వంటకాలతో ప్రత్యేకంగా మోదీ థాలి వడ్డిస్తాం. 40 నిమిషాల్లో థాలీని పూర్తి చేసిన వారికి రూ.8.5 లక్షలు అందజేస్తాం. ఇద్దరు విజేతలను మోదీకెంతో ఇష్టమైన కేథార్‌నాథ్‌ సందర్శనకు పంపిస్తాం’’ అని ప్రకటించింది. ఈ థాలీలో 20 రకాల కూరలతోపాటు రకరకాల బ్రెడ్లు, పప్పు, గులాబ్‌ జామ్, కుల్ఫీ సహా మొత్తం 56 వెరైటీలుంటాయి.

వెజిటేరియన్‌ థాలి రూ.2,600, నాన్‌ వెజ్‌ థాలి రూ.2,900. డిన్నర్‌ థాలి అయితే మరో రూ.300 ఎక్కువట. వీటిపై పన్నులు అదనం. మోదీ అంటే తమకెంతో అభిమానమని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఆర్డర్‌ 2.1 అనే ఈ రెస్టారెంట్‌ ఓనర్‌ సువీత్‌ కాల్రా చెప్పారు. ‘‘మా రెస్టారెంట్‌ అందించే వెరైటీ థాలీలకు ఎంతో ఆదరణ ఉంది. ధరలను తగ్గించాలని మోదీని కోరుతూ 10 రోజుల్లో ‘ద్రవ్యోల్బణం–మాంద్యం థాలి’ కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ రెస్టారెంట్‌లో ‘పుష్ప థాలి’, ‘బాహుబలి థాలి’ కూడా సర్వ్‌ చేస్తుండటం విశేషం!

ప్రధాని బహుమతుల వేలం
ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1,222 మైన జ్ఞాపికలు, బహుమతుల ఈ–వేలం నాలుగో విడత ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇది అక్టోబర్‌ 2 దాకా సాగనుంది. ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. వేలం ద్వారా సమకూరే మొత్తం నమామి గంగ ప్రాజెక్టుకు వెళ్తుందని గుర్తు చేశారు. దేశ జీవనాడి అయిన గంగా నదిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ వేలంలో అందరూ పాల్గొనాలని కోరారు.

>
మరిన్ని వార్తలు