ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

25 Apr, 2022 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. సత్యనికేతన్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం సోమవారం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. చారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 25 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. అయితే భవనం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనతోపాటు జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను' అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్‌నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు