సిగ్గుచేటు.. సమాజం ఎటుపోతుందో ‍అర్థం కావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి..

2 Jan, 2023 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు.

ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.
చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం

మరిన్ని వార్తలు