Shaheen Bagh Demolition Drive: షాహీన్‌ బాగ్‌ల కూల్చివేతకు బుల్డోజర్లు.. తీవ్ర ఉద్రిక్తత

9 May, 2022 13:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మళ్లీ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు నిర్వహించి వార్తల్లో నిలిచిన షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం బుల్డోజర్లు, జేసీబీలను అధికారులు షాహీన్‌బాగ్‌కు తరలించారు. అయితే ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకొని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్‌ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్థానిక నివాసితులతోపాటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపారు. 
చదవండి: ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్‌

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని తెలిపారు.  ఉద్దేశపూర్వకంగాశాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే బుల్డోజర్ల చర్య తీసుకున్నారని బీజేపీపై మండిపడ్డారు. కాగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలోనూ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు