-

ఈపీఎఫ్: కరోనాతో చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

1 Jun, 2021 17:12 IST|Sakshi

కోవిడ్ -19 సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. గత ఏడాది కరోనా మరణాల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజువారీ మరణాల సంఖ్య 4,500 మార్కును కూడా దాటింది. ఈపీఎఫ్ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన నగదు ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద ఉద్యోగి కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా రూ.7,00,000 వరకు బీమా డబ్బులు లభిస్తాయి. 

చనిపోయినవారి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి ఈపీఎఫ్ ఫామ్ 20 సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పేరు, తండ్రి లేదా భర్త పేరు, సంస్థ పేరు, చిరునామా, ఈపీఎఫ్ ఖాతా నెంబర్, ఉద్యోగంలో పనిచేసిన చివరి రోజు, ఉద్యోగం మానెయ్యడానికి కారణం అంటే మరణించారు అని వెల్లడించాలి. అలాగే, ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పుట్టిన తేదీ, మ్యారిటల్ స్టేటస్ లాంటి వివరాలు రాయాలి. ఇక ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తుల వివరాలు కూడా సమర్పించాలి. 

క్లెయిమ్ చేసే వ్యక్తి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, జెండర్, వయస్సు, మారిటల్ స్టేటస్, చనిపోయిన వ్యక్తితో ఉన్న సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. బ్యాంకు ఖాతా ద్వారా నగదు పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, రద్దు చేసిన చెక్ ఈపీఎఫ్ కార్యాలయం లేదా పోర్టల్ లో సమర్పించాలి. ఇంకా ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 నింపాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి.

చదవండి: 

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే లింక్ చేయండి

మరిన్ని వార్తలు