ఆకాశవీధిలో పెళ్లి.. వధువరులపై కేసు!

24 May, 2021 16:56 IST|Sakshi

నిబంధనలు ఉల్లంఘించారంటూ డీజీసీఏ ఆగ్రహం

పెళ్లిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ: ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన  నూతన దంపతులు రాకేశ్‌దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. 

పెళ్లిపై విచారణ
ఛార్టెడ్‌ ఫ్లైట్‌లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న  ఫ్లైట్‌ సిబ్బందిని రోస్టర్‌ నుంచి తప్పిస్తూ షాక్‌ ఇచ్చింది.  ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. 

ఉల్లంఘించారనే
కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్‌ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా పెళ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని  తీవ్రంగా ‍ పరిగణించింది డీజీసీఏ. 

వైరల్‌గా మారిన పెళ్లి
తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్‌, దక్షిణలు పెళ్లి కుదిరింది. పెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వధువరులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన వారు బెంగళూరు నుంచి మధురైకి చార్టెట్‌ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ... విమానంలోనే వధువరులకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దేశం నలుమూలల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు