‘దేశంలో పెట్రోల్‌ ధరలు పెరగడానికి కారణమిదే’

7 Jun, 2021 22:53 IST|Sakshi

న్యూఢిల్లీ:  గత కొంత కాలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ బాదుడు సామాన్యుడిపై భారంగా మారింది. తాజాగా సోమవారం కూడా పెట్రోల్‌పై రేటు పెరగడంతో పలు రాష్ట్రాల్లో ఒక లీటరు పెట్రోల్‌ ధర సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పెరుగుతున్న పెట్రోల్‌ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గుజరాత్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ దేశంలో పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

దీనికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో  ముడి చమురు ధర బ్యారల్‌కు ధర 70 డాలర్లుగా ఉండటమే. అంతే కాకుండా మన అవసరాల్లో 80శాతం దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతోందని వెల్లడించారు. ఇటీవలి కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఖరీదైనట్లు తెలిపారు. దేశంలో ఇంధన ధరలు ఇంతలా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలే  కారణమన్నారు. జీఎస్టీ అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలా? వద్దా అనేది జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని తెలిపారు. దీన్ని జీఎస్టీ కిందకు తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని చెప్పారు. అయితే తాను కూడా ఈ ఆలోచనను తాను కూడా అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

చదవండి: ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం: మోదీ

మరిన్ని వార్తలు